ప్రయాణికుల సురక్షిత ప్రయాణం అందించాలి
– భద్రత కోసమే “మై ఆటో ఇస్ సేఫ్”
– మెట్ పల్లి పట్టణంలో 346 ఆటోలు క్యుఆర్ కోడ్ తో అనుసంధానం
– ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణలో బాగస్వాములు కావాలి
– జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 26 (ప్రజాకలం) : మహిళలు, వృద్ధులు, ప్రయాణికులు సురక్షిత ప్రయాణం, భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “మై ఆటో ఇస్ సేఫ్” అనే కార్యక్రమంను మెట్ పల్లి పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు, ప్రయాణికుల సురక్షిత, భద్రత కొరకు మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో సుమారు 4000 లకు పైగా ఆటోలు ఉన్నాయని, ఇప్పటి వరకు 2500 లకు పైగా ఆటోలకు క్యు ఆర్ కోడ్ తో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. రాబోవు రోజుల్లో మిగతా ఆటోలకు కూడా ఈ యొక్క స్టిక్కరింగ్ వేయడం జరుగుతుందని అన్నారు. కాగా ఈ రోజు మెట్ పల్లి పట్టణంలో సుమారు 346 ఆటోలకు (ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా) స్టిక్కరింగ్ చేయడం జరిగిందని, ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు “”మై ఆటో ఇస్ సేఫ్” అనే స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలని సూచించారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదేనా సమస్య ఎదురైతే ఆటో డ్రైవర్ సీట్ వెనకాల గల కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే అట్టి ఆటో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్ నందు కనిపిస్తుంది వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్,ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు. ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు పోలీస్ వారు ఆ యొక్క సమాచారం ఆదారంగా వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవడం జరుగుతుందన్నారు. కాగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా ”సురక్షిత ప్రయాణం” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి తరచూ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను సందర్శిస్తూ వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదల నివారణలో ఆటో డ్రైవర్లు కూడా భాగస్వాములై ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు, ఆర్టీఓ శ్రీనివాస్, మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్ఐలు కిరణ్ కుమార్, రాజు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఓనర్స్ పాల్గొన్నారు.